హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఇంజినీర్లతో సంప్రదింపులు జరపకుండా హడావిడిగా విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) హెచ్చరించింది. శనివారం బెంగళూరులో ఏఐపీఈఎఫ్ ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించగా, పలు రాష్ర్టాల ప్రతినిధులు హాజరయ్యారు. విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు అతిపెద్ద వాటాదారులైన పవర్ ఇంజినీర్లతో చర్చించాలని తీర్మానం చేశారు. ఈ బిల్లును తిరోగమన చర్యగా ఏఐపీఎఫ్ చైర్మన్ శైలేంద్రదూబే, సెక్రటరీ జనరల్ పీ రత్నాకర్రావు, చీఫ్ ప్యాట్రన్ కే అశోక్రావు అభివర్ణించారు. రైతులు, వినియోగదారులు, విద్యుత్తు ఉద్యోగులతో చర్చించిన తర్వాతే బిల్లును ప్రవేశపెడతామని సంయుక్త కిసాన్ మెర్చాకు
లేఖ రాసినా కేంద్రం, ఇప్పటి వరకు చర్చలు జరపలేదని మండిపడ్డారు. కేంద్రం విధానాలపై విద్యుత్తు ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నదని చెప్పారు. ప్రజావ్యతిరేకబిల్లును ఏకపక్షంగా ఆమోదించే ప్రయత్నం చేస్తే, దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు ఇంజినీర్లు ఆందోళన బాటపడుతారని హెచ్చరించారు.