హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం గత ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం త్వరలో ఫలించనున్నది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ వర్సిటీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు రాజ్యసభ తాజా బులెటిన్లో వెల్లడించింది. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన బిల్లులో హామీ ఇచ్చిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ 2014 నుంచి అనేక పర్యాయాలు ప్రధాని మోదీని కలిసి గిరిజన వర్సిటీ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయినా ఫలితం లేకపోడంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల ఎన్నో పోరాటాలు చేశారు. దీంతో స్థలం ఎంపిక, వర్సిటీ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసి కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది.
అడుగడుగునా కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్
గిరిజన వర్సిటీతోపాటు ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఐబీఎం, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీల ఏర్పాటులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన వర్సిటీ ఏర్పాటును ఎందుకు విస్మరిస్తున్నారని కేంద్ర మంత్రులను ఎన్నోసార్లు ప్రశ్నించారు. ఇదే విషయమై గత ఏడాది ఆగస్టులో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ముండాకు లేఖ రాశారు. దీంతో నరేంద్రమోదీ సర్కార్ దిగివచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ చట్ట సవరణలో భాగంగా తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీసుకురానున్నది.
కేంద్రంపై తెలంగాణ ఒత్తిడి ఫలితమే..
తెలంగాణలోని గిరిజన బిడ్డలకు ఉన్నత విద్యను అందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే గిరిజన వర్సిటీని రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్పించి ఆయన తన దార్శనికతను చాటుకొన్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్రం ఎట్టకేలకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురానున్నదన్న వార్త చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ వర్సిటీ కోసం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై అనేక రూపాల్లో పోరాడారు. సీఎం కేసీఆర్ స్వయంగా అనేకసార్లు ప్రధాని మోదీని కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ త్వరలో ఫలించనుండటం సంతోషదాయకం.
– సత్యవతి రాథోడ్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి