Talasani Bike Rally | భారీ మెజార్టీతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పద్మారావు నగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించారు. ముషీరాబాద్, కృష్ణా నగర్ కాలనీ, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్, జబ్బార్ కాంప్లెక్స్, సిటీ లైట్ హోటల్, మొండా మార్కెట్, మహంకాళి టెంపుల్, మినిష్టర్ రోడ్, రసూల్ పురా, పాటిగడ్డ, ప్రకాష్ నగర్, బేగంపేట, గ్రీన్ పార్క్ హోటల్, కనకదుర్గమ్మ టెంపుల్, సత్యం థియేటర్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్, బల్కంపేట టెంపుల్, ఫతే నగర్ ప్లై ఓవర్, సనత్ నగర్ బస్టాప్, జెక్ కాలనీ వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సుమారు 5 కిమీ మేర బైక్లు నిలిచిపోయాయి.
మంత్రి శ్రీనివాస యాదవ్ ఓపెన్ టాప్ ప్రచార రథంపై నిల్చుండి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ను గత తొమ్మిదిన్నరేండ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. అద్వాన్నంగా ఉన్న రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేశామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చి రోడ్లపై మురుగునీరు ప్రవహించకుండా, మ్యాన్ హొల్స్ లీకేజీలు లేకుండా చేశామని వివరించారు. రిజర్వాయర్ లు నిర్మించి ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించిట్లు తెలిపారు.
రూ. 45 కోట్ల వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టి వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని తలసాని శ్రీనివాస యాదవ్ గుర్తు చేశారు. ఇవే కాకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో మల్టీ ఫర్పస్ ఫంక్షన్ హాళ్లు నిర్మించామని చెప్పారు. తనకంటే ముందు ఉన్న వారు సీఎంగా, కేంద్రమంత్రిగా ఉండి కూడా చేయలేని అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.1400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు చేశామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా అర్హులైన వారందరికీ అందిస్తూ వస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇంకా అర్హులైన వారు ఉంటే వారికి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిత్యం ప్రజల మద్యే ఉంటూ వారి కష్ట సుఖాలలో అండగా నిలుస్తూ వస్తున్నానని తెలిపారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాననే భరోసాను నియోజకవర్గ ప్రజలకు కల్పించానన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో నే తమకు మేలు జరుగుతుందనే పూర్తి విశ్వాసం తో ప్రజలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఈ బైక్ ర్యాలీలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, కుర్మ హేమలత లక్ష్మీపతి, టీ మహేశ్వరి శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, నామన శేషుకుమారి, ఆకుల రూప హరికృష్ణ, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, తలసాని స్కైలాబ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్, తలసాని మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.