చౌటుప్పల్, ఆగస్టు 21: మునుగోడులో బీజేపీ నిర్వహించిన సభకు స్థానిక ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు జన సమీకరణకు నానా తంటాలు పడ్డారు. ప్రజలను తరలించేందుకు పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకొన్నారు. టీఆర్ఎస్కు కంచుకోట ఉన్న చౌటుప్పల్ మండలం నుంచి జనం కదలకపోవడంతో తలలు పట్టుకున్నారు. దీంతో మండలంలోని స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్న బీహార్ కూలీలకు డబ్బులిచ్చి తరలించారు.
ఎస్ లింగోటంతోపాటు పలు గ్రామాల్లోని బీహార్ కూలీలకు రూ.500 నగదు, పులిహోరా, రాత్రికి మర్యాద చేస్తామని చెప్పి అమిత్షా సభకు తీసుకెళ్లారు. బస్సుల్లో కూర్చున్న కూలీలను నమస్తే తెలంగాణ ప్రతినిధి ఎక్కడికెళ్తున్నారు? అని అడగగా పాంచ్ సౌ ఇస్తామంటే వెళ్తున్నామని చెప్పారు.