నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓడించాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ హక్కులను కాల రాస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
చిట్యాలలో మంగళవారం ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఎం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల సంయూక్త సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చే పనిలో నరేంద్ర మోడీ నిమగ్నమయ్యారని విమర్శించారు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల తీర్పులకి వ్యతిరేకంగా మోదీ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలని కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అదానీ, అంబానీ వంటి కార్పొరేట్శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని మండిపడ్డారు. దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బీజేపీ వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శి లు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మహ్మద్ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.