హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పెద్ద పులులు తోడు కోసం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడి ఆవాసాల్లో ఒత్తిడితోపాటు తిండి, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తుండటంతో రాష్ర్టానికి పులుల రాక పెరిగింది. శీతాకాలంలో మరింత ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఏటా నవంబర్ లో వ్యాఘ్రాలు ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుంటాయి. సరిగ్గా రెండేండ్ల క్రితం ఇదే సీజన్లో ఏ2 అనే మగపులి మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలో సంచరించింది. కవ్వాల్ నుంచి కాగజ్నగర్ వరకు తిరిగింది.
రెండు చోట్లా ఆవాసం, తోడు కోసం ఆధిపత్య పోరు జరిపింది. చివరకు ఓపెన్ కాస్టులు, పత్తి చేలలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరిపై దాడి చేసి చంపేసింది. తాజాగా మూడున్నర ఏండ్లు న్న మరో మగ పులి నవంబర్ 15న ఒకరిపై దాడి చేసింది. ఈ పులి ఆవాసం, తోడు కోసం సంచరిస్తున్నది. ఎక్కడా స్థిరపడకుండా రోజు కు కనీసం పది కిలోమీటర్లకుపైగా తిరుగుతున్నది. నిలకడ లేని పులులు.. దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పులులు ఏడాది పొడవునా జత కట్టగలవు. చలి తీవ్రత అధికంగా ఉండే నవంబర్ నుంచి జనవరి వరకు జత కట్టేందుకు ఎక్కువగా ఇష్టపడతాయి. మగవి ఆడ పులులను వెతుక్కుంటాయి. ఆడ పులి 10 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉండిపోతే, మగపులి 100 నుంచి 150 కిలోమీటర్లు తిరుగగలదు. ఒక్కో మగ పులి రెండు, మూడు ఆడపులులతో సావాసం చేయగలదు. కొత్తగా వచ్చే మగ పులులకు అప్పటికే అక్కడున్న పులుల మధ్య తోడు కోసం ఘర్షణలు జరిగే అవకాశాలుంటాయి. అప్పుడు వాటిని ఆ ప్రాంతం నుంచి తరిమేస్తే మరో ప్రాంతానికి వెళ్తుంటాయి. రెండేండ్ల క్రితం మహారాష్ట్ర, తెలంగాణలో మొత్తం మూడు వేల కిలోమీటర్లు తిరిగి ‘వాకర్ ’ అనే మగపులి రికార్డు సృష్టించింది. పులి మెడకు అక్కడి అధికారులు రేడియో కాలర్ అమర్చడంతో తోడు కోసమే తిరిగినట్టు గుర్తించారు. అప్పట్లో మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో జే1 మగపులి కవ్వాల్ కోర్ ప్రాంతంలో ఆవాసం కల్పించుకున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ అడవులు అనేక పులులకు అవాసం ఇవ్వగలవు. అనుకూలమైన ఆ వాసాలు ఉంటేనే కొన్నాళ్లు ఉంటాయి. కవ్వాల్ కోర్ ప్రాంతంలో పులుల జీవనం సాగితే అటవీ అధికారులు, స్థానికులకు సమస్యలు ఉండకపోయేవి. కానీ, కోర్ అవతల బఫర్ జోన్ అంటే పులుల కారిడార్గా పిలిచే ప్రాంతాల్లో సంచరించడం ఆందోళన కలిగిస్తున్నది.