Boora Narsaiah Goud | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇటీవల కేఏ పాల్ కనిపించడం లేదని, ఆయన స్థానాన్ని ఆర్జీ పాల్ భర్తీ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి బీజేపీ భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఇద్దరు నేతలు కొన్నాళ్ల క్రితం వరకు రేవంత్రెడ్డిని తీవ్ర దుర్భాషలు ఆడారని, ఇప్పుడు ఆయన పంచన చేరి పొగుడుతున్నారని చెప్పారు.
మంత్రి పదవిలో కొనసాగాలని ఒకరు, హోంమంత్రి పదవి కావాలని ఇంకొకరు అంటకాగుతున్నారని ఆరోపించారు. నల్లగొండ ప్రజల, రైతుల గురించి వారు పట్టించుకోవడమే లేదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదం అని విమర్శించారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ జరగక రైతులు అవస్థలు పడుతున్నారని, ఎండిన పంటకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రైతుబంధు వేయలేదని మండిపడ్డారు. బీసీ సబ్ప్లాన్పై హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు.