భూపాలపల్లి, సెప్టెంబర్ 2: ఓ వ్యాపారి నుంచి రూ.25 వేలు లంచం తీసుకొంటుండగా భూపాలపల్లి ఎస్సై ఇస్లావత్ నరేశ్ను ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. వరంగల్ ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ హరీశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన సీ ఉదయ్శంకర్ కొద్ది నెలలుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఏసీల వ్యాపారం చేస్తున్నారు. ఉదయ్శంకర్ కరీంనగర్కు చెందిన గురుప్రసాద్ వద్ద రూ.30 లక్షలు అప్పు తీసుకొని వడ్డీ చెల్లిస్తున్నారు. అసలు కూడా ఇవ్వాలని జూలైలో గురుప్రసాద్ అడిగినట్టు తెలిసింది. అయితే డబ్బుల కోసం తనను ఇబ్బందికి గురిచేస్తున్నాడంటూ ఉదయ్శంకర్ డయల్ 100కు ఫోన్ చేశాడు. పోలీసులు ఇద్దరిని పిలిచి మాట్లాడి, పంపించారు. కాగా, పంచాయితీ ఎస్సై వద్దకు చేరింది. ఈ విషయాన్ని సెటిల్ చేసేందుకు ఉదయ్శంకర్ను ఎస్సై నరేశ్ రూ.75 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.25 వేలకు అంగీకరించాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భూపాలపల్లిలో వ్యాపారి ఉదయ్శంకర్ నుంచి ఎస్సై నరేశ్ డబ్బులు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్టు ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ హరీశ్కుమార్ తెలిపారు.