కామారెడ్డి, మే 31: సీఎం కేసీఆర్ హయాంలోనే రెడ్డి సమాజానికి లబ్ధి చేకూరుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద రెడ్డి, ఇతర విద్యార్థుల కోసం నిర్మించనున్న రెడ్డిహాస్టల్, విద్యాలయం, సంక్షేమభవన్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో మంత్రి వేముల మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా చేసిన మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి లాంటి వారు రెడ్డి సమాజం కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఒక్కరే రెడ్డి సమాజాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఒక ఊరిలో రెడ్డి బాగుంటే అందరూ బాగుంటారని సీఎం కేసీఆర్ ప్రగాఢంగా విస్వసిస్తారని తెలిపారు. రాజ్ బహదూర్ వెంకటరాంరెడ్డి ట్రస్టుకు హైదరాబాద్లో రూ.150 కోట్ల విలువైన 15 ఎకరాల భూమి ఇచ్చారని, భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న రెడ్డి బంధువులందరూ గుండెమీద చెయ్యి వేసుకొని ఈ విషయాన్ని ఆలోచించాలని వేముల హితవు పలికారు.
సంక్షేమ లబ్ధిదారుల్లో రెడ్లదే అగ్రస్థానం
రెడ్డి కులంలో కూడా పేదలున్నారని, వారి కోసం రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్ట్ పేరుతో సేవలందించడం అభినందనీయమని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిలో రెడ్డి సామాజికవర్గం వారే అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రతి రెడ్డి రైతు కుటుంబానికి అందుతున్నాయని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రెడ్ల సంక్షేమానికి ఎంతగానో మేలు జరుగుతున్నదని చెప్పారు. ఈ ట్రస్టుకు అవసరమైతే మరిన్ని నిధుల కోసం సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ట్రస్ట్ అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి, విద్యాదాత సుభాశ్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.