హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో అధికారులు ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ (UNWTO) వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సమావేశంలో అవార్డు అందజేశారు. భారత కాలమాన ప్రకారం.. ఇవాళ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాస్గౌడ్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అవార్డును భారత్ తరఫున స్పెయిన్లోని భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి సుమన్ శేఖర్ స్వీకరించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో పర్యాటకరంగం అద్భుతమైన ప్రగతి
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పర్యాటకరంగం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు. ఏడు సంవత్సరాల్లోనే అంతర్జాతీయ స్థానంలో బెస్ట్ టూరిజం విలేజ్గా భూదాన్పోచంపల్లి గ్రామానికి యూఎన్డబ్ల్యూటీఓ అవార్డు ప్రదానం చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ప్రాంతీయ అసమానతలు తగ్గించి, గ్రామాల నుంచి వలస వెళ్లే వారి సంఖ్యను తగ్గించటానికి జరిపే కృషిలో పర్యాటక రంగం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SGD)కు అనుగుణంగా, సుస్థిరతకు మూడు స్తంభాలైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు యూఎన్డబ్ల్యూ టీఓ అవార్డుకు ఎంపిక చేసిందని మంత్రి పేర్కొన్నారు.