హైదరాబాద్, జూన్5 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో తెలంగాణలోని మున్నూరుకాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. హైదరాబాద్లోని కోకాపేటలో ఈ నెల 9న ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజ చేయాలని నిర్ణయించాయి. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి గంగుల నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్నూరుకాపు సంఘాల నేతలు సమావేశమై ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరుకాపుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భూమిపూజకు మున్నూరుకాపులు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆహ్వానించారు. భూమిపూజకు హాజరయ్యేవారికి అల్పాహారం, భోజనం ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తు తరాలకు అన్నివిధాల అండగా ఉండటం కోసం మున్నూరుకాపులంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాచిగూడ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మాణికొండ వెంకటేశ్వరరావు, నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు .