హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుందని, అందులోనూ ఖమ్మం జిల్లాలో మొదట ఓడిపోయేది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అని, ఇది రాసిపెట్టుకోవాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లలో మొట్ట మొదటిది మధిరనే అని, తాము సీపీఎంతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదా అని భట్టి బాధపడతారని, కాంగ్రెస్కు బుద్ధి వస్తుందని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి బరిలోకి దిగాలని సీపీఎం భావించింది. కానీ వారు అడిగిన స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో చర్చలు బెడిసికొట్టాయి. దాంతో ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. తాము ఒంటరిగా పోటీ చేయాలనుకోలేదని, కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు వద్దనుకోవంతో సొంతంగా 19 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు.
త్రిపురలో తమ సిట్టింగ్ స్థానాన్ని పీసీసీకి వదిలేశామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మా కోసం త్యాగం చేయలేదని తమ్మినేని ఆరోపించారు. పొంగులేటి ఉన్నారనే కారణంతో పాలేరు ఇవ్వలేదన్నారు. వైరా, మిర్యాలగూడ సీట్లు ఇస్తామని చెప్పి చివరికి మిర్యాలగూడ ఒక్కటేనని కాంగ్రెస్ చెప్పిందని, దాంతో పొత్తు కుదరదని తేల్చుకున్నామని, అందుకే ఒంటరిపోరుకు సిద్ధమయ్యామని తమ్మినేని చెప్పారు.