Congress | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కథ మళ్లీ మొదటికొచ్చింది. అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. ఖమ్మం కాంగ్రెస్లో ముగ్గురు కీలక నేతల ఆధిపత్య ధోరణి మధ్య ఎంపీ అభ్యర్థి ఖరారు కాలేదు. దీంతో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని పార్టీ శ్రేణులు ఒకవైపు, నామినేషన్ల దాఖలుకు గడువు దగ్గర పడుతున్నదని అధిష్ఠానం ఇంకోవైపు ఆందోళనకు గురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు (ఒకరు డిప్యూటీ సీఎం) వెంటనే ఢిల్లీ రావాలని ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆ ముగ్గురు.. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయంతో హస్తినకు వెళ్తారా? లేదా నిర్ణయాన్ని మీరే తేల్చండని ఏఐసీసీకి వదిలేస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేమని జిల్లా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం ఎంపీ టికెట్ను తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు కుటుంబాలకు కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తేల్చి చెప్పింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
అయితే, తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వబోమని.. మళ్లీ పొంగులేటి వియ్యంకుడు రఘురాంరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని భట్టి, తుమ్మల తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. పైగా 2014 ఎంపీ ఎన్నికల్లో తప్ప (వైసీపీ తరఫున పొంగులేటి శ్రీనివాస్రెడ్డి) ఖమ్మం నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి గెలిచిన చరిత్ర లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క తన వాదనను గట్టిగా వినిపించినట్టు సమాచారం.
మండవను తెరపైకి తెచ్చిన రేవంత్
ఈ పంచాయితీని తనకు అనుకూలంగా మలచుకొని సీఎం రేవంత్ రంగంలోకి దిగి.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వర్రావు పేరు తెరపైకి తీసుకొచ్చారు. మండవ తన సామాజికవర్గానికి చెందటంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.
ఖమ్మం ఎంపీ అంటేనే కమ్మల సీటు అని, గతంలో ఇదే సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల భాస్కర్రావు, రేణుకాచౌదరి, నామా నాగేశ్వర్రావు, తమ్మినేని వీరభద్రం గెలిచిన చరిత్రను అధిష్ఠానం ముందు పెట్టినట్టు తెలిసింది. ఈ పంచాయితీలో వేరే వ్యక్తి పేరు తెరపైకి రావటంతో కంగుతిన్న భట్టి, పొంగులేటి ఏకమై మండువ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఇస్తే గిస్తే జిల్లాకు చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలి కానీ, నాన్లోకల్ అయిన మండవకు టికెట్ ఇస్తే అసలుకే ఎసరు వస్తుందని, గెలవడం కష్టమని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
మీరే తేల్చుకోండి
నాన్లోకల్ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఈ ముగ్గురు పార్టీ గెలుపునకు సమష్టిగా కృషిచేస్తారో లేదోనని అధిష్ఠానం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. తన సోదరుడు ప్రసాద్రెడ్డి, వియ్యంకుడు రఘురాంరెడ్డిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాను ఒంటి చేత్తో గెలిపించుకొస్తానని పొంగులేటి రంగంలోకి దిగారు. పార్టీలో చేరినప్పుడు ఎంపీ టికెట్ తాను సూచించిన వ్యక్తికే ఇస్తానని అధిష్ఠానం మాట ఇచ్చిందని పట్టుబట్టారు.
ఒక దశలో అధిష్ఠానం కూడా పొంగులేటి వాదనతో మెత్తబడి ప్రసాద్రెడ్డికి టికెట్ ఇవ్వటానికి సిద్ధమైనట్టు సమాచారం. అయితే, తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయం ఏమైందని భట్టి, తుమ్మల అభ్యంతరం వ్యక్తం చేయటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక.. ఇలా కాదనుకొని భట్టి, పొంగులేటిని హస్తినకు రావాలని ఆదివారం ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలిసింది. సోమవారం భట్టి, పొంగులేటి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటిదాకా అభ్యర్థి ఎంపిక తేలకపోగా, ఈ నెల 24న నామినేషన్ దాఖలుకు గడువు ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రానికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నదని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.