హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఆర్టిజన్ కన్వర్షన్ (క్రమబద్ధీకరణ) సహా పలు డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ విద్యుత్తు ఆర్జిజన్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారంతో పుల్స్టాప్ పడింది. పది రోజులుగా చేపట్టిన సమ్మెను కార్మికులు విరమించారు. శుక్రవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టిజన్ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. సమ్మెలపై నిషేధముందని, వేసవిలో విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరుగుతున్న తరుణంలో సమ్మెలకు దిగడం సరికాదని జేఏసీ నేతలకు సూచించారు. కార్మికులతో చర్చించాలని ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
సమ్మెను విరమించాలని జేఏసీ నేతలు విద్యుత్తు ఆర్టిజన్లను కోరారు. ఆర్టిజన్ జేఏసీ నేతలు సమ్మెను విరమించేందుకు అంగీకరించారు. డిమాండ్లపై సర్కార్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేవలం ఆర్థికభారంలేని సమస్యలను మాత్రమే చర్చల అనంతరం పరిష్కరించనున్నట్టు సమాచారం. టీజీ ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ సతీశ్రెడ్డి, కో చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్గౌడ్, చందర్సింగ్ఠాకూర్, సంతోష్, ప్రశాంత్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.