BRS | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మూడో సభకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్ఎస్ ఇప్పుడు మధ్య మహారాష్ట్రపై దృష్టిపెట్టింది. ఈ నెల 24న ఔరంగాబాద్లో నిర్వహించనున్న సభకు బీఆర్ఎస్ శ్రేణు లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
కంధార్-లోహా సభ అనంతరం ఔరంగాబాద్లో సభ నిర్వహించాలని స్థానిక నాయకులు, ప్రజల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో ఔరంగాబాద్లో మూడో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేలకు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఔరంగాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాడల్పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం శంభాజీనగర్లో తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రథాలను ఎమ్మెల్యే జీవన్రెడ్డి నేతృత్వంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, బీఆర్ఎస్ నేతలు అంకిత్, శివాంక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన వందలాది స్కీంల విశిష్టతను ఈ డిజిటల్ స్క్రీన్ ప్రచార రథాల ద్వారా మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. ఇటీవల కంధార్-లోహా బహిరంగ సభకు ముందు అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఔరంగాబాద్లోనూ అమలు చేస్తున్నారు.
మహారాష్ట్రలో పార్టీకి విస్తృత ఆదరణ లభిస్తున్నదని ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు, బీజేపీ, కాంగ్రెస్ సీట్ల రాజకీయాలతో మహారాష్ట్ర ప్రజలు విసుగుచెందారని చెప్పారు. సీఎం కేసీఆర్కు మహారాష్ట్ర ప్రజల్లో ఎనలేని క్రేజ్ ఉందని తెలిపారు. కేసీఆర్లాంటి విజన్ ఉన్న నాయకుడు తమకు కావాలని, బీఆర్ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై ఎంతోమంది బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఔరంగాబాద్ సభ ద్వారా మహారాష్ట్ర ప్రజలకు చేసే దిశానిర్దేశం దేశ రాజకీయాలకు మేలిమలుపుగా ఉంటుందని అన్నారు.