హైదరాబాద్ సిటీబ్యూరో, న్యూస్ నెట్వర్క్ మార్చి 12 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి భగ్గుమన్నది. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటంపై రెండో రోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ప్రధాని మోదీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలకు పార్టీ శ్రేణులు, మహిళలు శవయాత్రలు నిర్వహించారు. చెప్పులు, చీపుర్లతో కొడుతూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మలను దహనం చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని మహిళలు హెచ్చరించారు. మహిళా లోకానికి, కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అన్ని చోట్ల బండిపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. బండి సంజయ్కు భవిష్యత్తులో మహిళలు తగినరీతిలో గుణపాఠం చెప్తారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు. మాదాపూర్లోని సాయినగర్ కాలనీలో ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, ఎడపల్లి మండల కేంద్రాల్లో సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శ్రేణులతో కలిసి ధర్నానిర్వహించారు.
జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా పని చేస్తున్న బండి సంజయ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సమంజసం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హితవు పలికారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సభ్యతా సంస్కరం లేకుండా మహిళా నేతపై అనుచిత వాఖ్యలు చేయడం సిగ్గుచేటని, వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో మహిళలే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజకీయ జీవితంలో ఉన్న వారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజస్వామిక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనలేకనే ఎమ్మెల్పీ కవితను టార్గెట్ చేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి, ఆడబిడ్డలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. వెంటనే ఎమ్మెల్సీ కవిత, మహిళలందరికీ బండి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.