హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): దేశంలో పోక్సో కేసుల్లో శిక్షల శాతం ఎంతని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత ప్రశ్నించారు. 2014 నుంచి పోక్సో కేసుల్లో శిక్షలు 38 శాతానికి ఎందుకు మించడం లేదని అడిగారు. నేరస్థులకు శిక్షలు పడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటని శుక్రవారం లోక్సభలో ప్రశ్నించారు. వీటికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సృ్మతి ఇరానీ సమాధానం ఇచ్చారు. పోక్సో కేసులను పరిష్కరించేందుకు క్రిమినల్ లా (సవరణలు) చట్టం 2018 ప్రకారం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కేసులను ఏడాది లేదా రెండేండ్లలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందని పేర్కొన్నారు. 2019 అక్టోబర్లో కోర్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 1,023 పోక్సో కేసులను ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో పరిషరించినట్టు వివరించారు. 768 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 418 పోక్సో కోర్టులతోపాటు అన్ని కోర్టుల్లో కలుపుకొని మొత్తం 1.37 లక్షల కేసుల్లో తీర్పు వెలువడిందని తెలిపారు. మరో 1.98 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (ఎన్పీసీ) నివేదిక ప్రకారం 5.54 శాతం రెగ్యులర్ కోర్టు కేసులు, 7.21 శాతం ఫాస్ట్ట్రాక్ కోర్టులు, 17.64 శాతం పోక్సో ప్రత్యేక కోర్టుల్లో శిక్షలు పడ్డాయని స్పష్టం చేశారు.