హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకాకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. పిల్లల్లో ఈ టీకా అత్యంత సమర్థంగా పనిచేస్తునట్టు ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైందని ‘లాన్సెట్ జర్నల్’ పేరొన్నది. 2 నుంచి 18 ఏండ్లవారికి కొవాగ్జిన్ ఎంతో సురక్షితమైనదిగా తేలినట్టు వెల్లడించింది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ టీకా 1.7 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు ఫేజ్-2, 3 క్లినికల్ ట్రయల్స్లో తేలిందని లాన్సెట్ పేరొన్నది. పిల్లల్లో కొవాగ్జిన్ పనితీరును పరిశీలించేందుకు గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. వీటి ఫలితాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం 6-18 ఏండ్లవారికి కొవాగ్జిన్ టీకా అందించేందుకు అనుమతులు జారీచేసింది. ఇప్పుడు లాన్సెట్ జర్నల్ సైతం కొవాగ్జిన్ పనితీరును ప్రశంసించడంపై భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్లో పిల్లలకు సుమారు 50 మిలియన్ల కొవాగ్జిన్ డోసులు ఇచ్చామని, వారిలో ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని తెలిపారు.