హైదరాబాద్ : జీవితమంతా దళితుల అభివృద్ధికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో వర్మ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
1906-33 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత పాఠశాలలను భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. బాలికల విద్య కోసం విశేష కృషి చేశారు. 1906లో ఇసామియా బజార్లో బాలికల విద్య కోసం జగన్ మిత్రమండలి ఏర్పాటు చేశారు. 1910లో జగన్ మిత్రమండలి కార్యాలయంలో మొట్టమొదటగా ప్రాథమిక పాఠశాల స్థాపించాడు భాగ్యరెడ్డి. అలా ఏడు పాఠశాలలు వరుసగా ఏర్పాటు చేసి, 1922లో రెసిడెన్సీ మెమోరియల్ దగ్గర మరో పాఠశాలను 30 మంది బాలురతో ప్రారంభించారు. ఇలా మొత్తం మీద ఆది హిందూ పాఠశాలల సంఖ్య 26 కు చేరింది. ఈ 26 పాఠశాలల్లో దాదాపు 2500 మంది విద్యార్థులు అభ్యసించేవారు.