మహబూబ్నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి;అబద్ధం జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు కలుషితం కావడం వల్ల నలుగురు మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం నీరు తాగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు.
వాస్తవం: జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసారం ప్రబలి వాంతులు, విరేచనాలతో నలుగురు చనిపోయారని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ వాసులు వాంతులు, విరేచనాలతో సుమారు 50 మంది జిల్లా దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. అదేరోజు రాత్రి మరొకరు మరణించారు.
శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన మరొకరిని చికిత్స నిమిత్తం వనపర్తికి తీసుకెళ్లి.. మళ్లీ గద్వాలకు తీసుకొస్తుండగా చనిపోయారు. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకొన్నారు. వెంటనే రంగంలో దిగి అతిసారాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. తాగునీరు కలుషితం కాలేదని నివేదిక ఇచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు తాగడం వల్లే చనిపోయినట్టు ఓ పత్రిక అవాస్తవాలను వెలుగులోకి తేవడం, దాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేశారని సదరు అధికారులు పేర్కొన్నారు.