హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా తెలంగాణ పథకాలను కాపీ కొట్టకుండా కొత్తగా ఏమీ చేయలేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం అనేక పథకాలను కాపీ కొట్టగా, తాజాగా బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అదే బాట పట్టాయి. తెలంగాణలో ఇంటింటికీ శుద్ధమైన నల్లా నీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఆ రాష్ట్రంలోని రెవారీ జిల్లాలో ‘హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్’ పేరుతో నల్లా ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించే పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ పథకం మక్కీకి మక్కీ మన మిషన్ భగీరథ పథకానికి కాపీయేనని అధికారులు అంటున్నారు. హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పథకానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా భరిస్తున్నాయి.
ఒక్క జిల్లాకే పరిమితం
తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్లు ఎత్తుపల్లాలన్న తేడా లేకుండా రాష్ట్రం నలుమూలల ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా నల్లా తిప్పితే స్వచ్ఛమైన నీళ్లు జలజలా కారుతాయి. ఈ పథకం కోసం ఏకంగా 1.5 లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. ఇంత పెద్ద పథకానికి వేల కోట్ల రూపాయలు ఖర్చయినా రాష్ట్రప్రభుత్వం ఒక్కటే భరించింది. మధ్యప్రదేశ్లో ప్రారంభించిన పథకానికి మాత్రం కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయం చేస్తున్నది. అయినా, అక్కడ ఈ పథకం ఒక్క జిల్లాకే పరిమితమైంది. అదికూడా ఇంకో మూడు నాలుగు నెలల తర్వాతగానీ రెవారీ జిల్లాలోని 50 శాతం ఇండ్లకు నల్లా ద్వారా నీళ్లు అందిస్తామని ఆ జిల్లాకు చెందిన ఎంపీ జనార్దన్ మిశ్రా చెప్పటం విశేషం.
బయటపడ్డ కేంద్రం వివక్ష
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం, దేశంలో ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించటంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ పథకాన్ని కాపీ కొట్టే కేంద్రప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకొంటున్నా, రాష్ట్రంలో ఆ ప్రతిష్ఠాత్మక పథకాలకు మాత్రం కేంద్రం ఒక్కపైసా ఇవ్వటంలేదు. మిషన్ భగీరథ అద్భుత పథకమని కొనియాడిన నీతి ఆయోగ్, దీనికి రూ.19,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా ఈ పథకానికి ఆర్థికసాయం చేయాలని ఎన్నోసార్లు కోరింది.
అయినా, ఇప్పటికీ కేంద్రం పైసా ఇవ్వలేదు. మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ పథకాన్ని పొగిడారు కానీ, పైసా సాయం చేయలేదు. అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం భగీరథ ప్రయత్నంతో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సొంత నిధులతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. కేంద్రంలో, మధ్యప్రదేశ్లో బీజేపీయే అధికారంలో ఉండటంతో మన మిషన్ భగీరథ నుంచి కాపీ కొట్టిన పథకానికి కేంద్రం భారీగా నిధులిస్తున్నది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం అవాకులు చెవాకులు మాట్లాడి వెళ్లిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు చివరకు మన పథకమే గతి అయ్యిందని తెలంగాణ వాదులు నవ్వుకొంటున్నారు.