హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని భరోసా కేంద్రం పనితీరుపై పార్లమెంటరీ మహిళా భద్రతా కమిటీ ప్రశంసలు కురిపించింది. లైంగికదాడులు, పోక్సో కేసుల్లో బాధితులకు ఒకేచోట అన్నిరకాల సేవలు అందిస్తుండటం అద్భుతమని కొనియాడింది. భరోసా కేంద్రం ద్వారా సిటీ పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చింది. డాక్టర్ హీనా విజయ్కుమార్ గవిత్ నేతృత్వంలోని పార్లమెంటరీ మహిళా భద్రతా కమిటీ బుధవారం హైదరాబాద్లోని భరోసా కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీ శిఖా గోయెల్, భరోసా ఇంచార్జి, అదనపు డీసీపీ శిరీష.. భరోసా కేంద్రం పనితీరు గురించి వివరించారు. కేంద్రం ఎలా పనిచేస్తుంది, బాలల కోర్టు, బాధితులకు కౌన్సిలింగ్, ఒకేచోట వైద్య, న్యాయ సలహాలు ఎలా అందిస్తున్నారు, పునరావాసం కోసం తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేశారు. లైంగికదాడులు, పోక్సో కేసుల్లో బాధితులకు ఒకేచోట అన్నిరకాల సేవలు అందిస్తున్నది దేశంలో భరోసా కేంద్రం ఒక్కటేనని వివరించారు. ఆరేండ్లలో 10 వేల మందికిపైగా బాధితులు భరోసా సేవలు అందుకున్నారని చెప్పారు. భరోసా కేంద్రాన్ని సందర్శించినవారిలో పార్లమెంటరీ మహిళా భద్రతా కమిటీ సభ్యులు జార్నాదాస్ వైద్య, లాకెట్ ఛటర్జీ, మమతా మొహంత, రమ్య హరిదాస్, మాలోతు కవిత, రితి పతాక్, శతాబ్దిరాయ్, గొమటి సాయి, గీతావిశ్వనాథ్ వంగ, వందన, ఛాయా వర్మ, క్విన్ ఓజా, లోక్సభ డైరెక్టర్ ఎంఎల్కే రాజా, అదనపు డైరెక్టర్ రీన గోపాలకృష్ణ, కమిటీ ఇతర అధికారులు రాధ నేగి, రాజి మనీశ్, నవనీత్ మోహన్ కొటారీ ఉన్నారు.