వరంగల్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రకాళి అమ్మవారి దేవాలయంలో మాడ వీధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఈ మొత్తాన్ని అందజేసింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మరో రూ.10 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.30 కోట్లతో భద్రకాళి మాడ వీధుల నిర్మాణం చేపట్టనున్నారు. భద్రకాళి దేవాలయంలో ఏటా అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు, నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వేల మంది భక్తులు వస్తుంటారు.
భద్రకాళి అలయం ఇరుకుగా ఉండటంతో ఉత్సవాల సమయంలో అమ్మవారి ఊరేగింపు ఇబ్బంది అవుతున్నది. భద్రకాళీ ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆమ్మవారి ఉత్సవాల సమయంలో నిర్వహించే రథోత్సవాలు, వాహన సేవలు మాడ వీధుల్లో జరుగనున్నాయి. మాడ వీధులకు నిధులు మంజూరు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.