దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తున్నది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో తగ్గుముఖం పట్టినట్లనిపించినా మార్చిలో శరవేగంగా విస్తరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లోకి పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ వేలల్లోకి చేరుకున్నది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 46,951 మందికి నిర్ధారణ కావడం కలవరం కలిగించింది. పొరుగు రాష్ర్టాల్లో కరోనా ఉధృతంగా ఉండటంతో తెలంగాణలోనూ దాని ప్రభావం పడుతున్నది. ఒకరోజు 394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే రికవరీ రేటు తగ్గుతుండటం, మరణాల రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కట్టడిలో అన్ని జాగ్రత్తలు సరిగ్గా పాటించకపోవడం, ప్రజల నిర్లక్ష్యం మరికొంత కలిసి ఈ పరిస్థితిని తెచ్చి పెట్టిందనవచ్చు. మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించటంపై ఏమాత్రం నిరాసక్తతయినా ప్రస్తుతానికి ప్రమాదకరమని గుర్తెరగాలి.
కరోనా వైరస్ మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో వేగంగా విస్తరిస్తున్నది. నమోదవుతున్న కేసుల్లో 83 శాతం ఈ ఆరు రాష్ర్టాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో రోజుకు కొన్ని వేల మందికి సోకుతున్నది. రాత్రిపూట కర్ఫ్యూ విధించే పరిస్థితి ఉత్పన్నమైంది. రాజస్థాన్లోని ఎనిమిది నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్లలో వారాంతపు లాక్డౌన్ ప్రకటించారు. మన రాష్ట్రంలో పరిమిత స్థాయిలో విద్యార్థులను అనుమతించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడ్డారు. విద్యాసంస్థలను పాక్షికంగా తెరవడం వల్ల ఏర్పడిన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తున్నది. కరోనా విస్తరించకుండా రాకపోకలపై దృష్టి సారించాలి. పొరుగు రాష్ర్టాల- ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో పకడ్బందీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం అవసరం.
దేశవ్యాప్తంగా విడతలవారీగా ఒకటి, రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా అది ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాల కొరత వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి ఆటంకంగా మారింది. కరోనా మరోసారి తీవ్రంగా వ్యాపిస్తే అనేక విధాల అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. గత ఏడాది కరోనా విస్తరించినప్పుడు మన సమాజం పడిన ఇక్కట్లను మరిచిపోకూడదు. అలాంటప్పుడు లాక్డౌన్ విధించవలసి వస్తుంది. లాక్డౌన్ విధిస్తే కోట్ల మంది జీవనోపాధి దెబ్బతింటుంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అందువల్ల మరోసారి అందరం అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. గత ఏడాది పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలను అనుసరించడం అందరికీ మంచిది.