చండ్రుగొండ, జనవరి 30 : దారితప్పిన ఓ ఎలుగుబంటి రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మద్దుకూరులో వాకింగ్కు వెళ్లిన నల్లమోతు రామారావుపై దాడి చేసి 24 గంటలు గడవకముందే మంగళవారం చండ్రుగొండలోని అంబేద్కర్ కాలనీలో కంచర్ల తిరుపతి ఇంట్లోకి చొరబడింది.
తిరుపతి ఇంటి ఆవరణ నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా అతడి కాళ్లపై దాడి చేసింది. బాధితుడు వెంటనే తేరుకొని అరవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పొలాల్లోకి పారిపోయింది. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఎలుగుబంటిని త్వరలోనే పట్టుకుంటామని, నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నామని ఎఫ్డీవో కోటేశ్వరరావు తెలిపారు.