హైదరాబాద్ జూలై 21 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం ప్రతినిధి: తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలం నుంచి దేని గురించి భయపడుతున్నారో అదే జరుగుతున్నది. తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరిలోని రాముడి దివ్య ఆలయం పోలవరం బ్యాక్వాటర్లో జలదిగ్బంధమయ్యే పరిస్థితి నెలకొన్నది. పొరుగు రాష్ట్రం అనాలోచితంగా తీసుకొంటున్న నిర్ణయాలు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కారణంగా భద్రాచలం వాసులు శాశ్వతంగా ముంపు ముప్పులో బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తిగా నిర్మించనేలేదు. కానీ.. దాని ప్రభావం తాజాగా వచ్చిన గోదావరి వరదలతో స్పష్టంగా కనిపించింది. శక్తి చైతన్యమూర్తి రామయ్య ఆశీస్సులతో ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న భద్రాద్రి.. ఇప్పుడు మానవ తప్పిదాల వల్ల కలవరపడుతున్నది. పోలవరం నిర్మాణానికి ముందు భద్రాచలం దగ్గర గోదావరి అనేక ఆటుపోట్లను అధిగమించింది. ఇప్పుడు ఇదే పోలవరం భద్రాద్రికి శాపవరంగా మారుతున్నది. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మొదట్నుంచీ అనేక అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నది. తెలుగువారి ఆరాధ్యదైవం కొలువై ఉన్న దివ్యక్షేత్రాన్ని కాపాడుకోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర జలవనరుల సంఘం సైతం తెలంగాణ వాదనలను బలపరిచింది. కానీ దాని పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నది.
దినదిన గండం
ఏటా ఎగువన కురిసే వర్షాలతో భద్రాచలం వద్ద నీటిమట్టం అధికంగానే ఉంటున్నది. జూలైలో కురిసిన వర్షాలకు 71.3 అడుగులకు నీటిమట్టం చేరుకొన్నది. 2020లో సైతం 61 అడుగులు చేరుకొన్నది. గతంలో 53 అడుగుల మట్టం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక ఒకటి రెండు రోజులు మించి ఉండలేదు. ఈసారి 71.3 అడుగుల గరిష్ఠస్థాయి నీటిమట్టం దాదాపు ఐదు రోజులు కొనసాగింది. మూడో ప్రమాద హెచ్చరిక ఈరోజు వరకూ కొనసాగుతున్నది. ఇందుకు కారణం పోలవరం నిర్మాణమేనని సాగునీటిరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2006లో వరద వచ్చినప్పుడు 66.9 అడుగులకు నీటిమట్టం చేరుకున్నా.. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినా.. పాలమీది పొంగులా సరిగ్గా మూడు రోజుల్లోనే సద్దు మణిగేది. ఈసారి మాత్రం అలా జరుగలేదు. 66.9 అడుగుల నుంచి 40 అడుగులకు చేరుకోవడానికి వారం రోజులు పట్టినట్టు రికార్డు నమోదైంది.
ఇప్పుడు ఈ పరిస్థితే భద్రాచల వాసులను ఆందోళనకు గురిచేస్తున్నది. గతంలో భద్రాచలం నుంచి ప్రవహించిన గోదావరి నేరుగా ధవళేశ్వరం చేరుకొనేది. కానీ.. ఇప్పుడు పోలవరం రావడంతో ధవళేశ్వరం చేరుకోవడానికి చాలా సమయం పడుతున్నది. ప్రవాహ వేగం తగ్గిపోయింది. దీంతో భద్రాచలం దగ్గర అంతకంతకూ గోదావరి నీటిమట్టం పెరిగిపోతున్నది. పోలవరం కారణంగా ధవళేశ్వరం బరాజ్లోకి వెళ్లాల్సిన నీళ్లు.. తెలంగాణ నుంచి తీసుకొన్న ఏడు మండలాలను ముంచెత్తడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాలను కూడా ముంపునకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాలు రోజుల తరబడి ముంపులో ఉంటున్నాయి. పోలవరం కారణంగా భద్రాచలం నుంచి దిగువకు నీటి ప్రవాహం అంతగా సాగలేదు. దీంతో గంటకు రెండు మూడు ఇంచుల మేర నీటిమట్టం పెరిగింది. సమయానికి దిగువకు ప్రవాహం వెళ్తే భద్రాచలం దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీటిని దిగువకు వదలకపోతేనే సమస్య. దుమ్ముగూడెం, పర్ణశాల, సారపాక, బూర్గంపాడులోని లోతట్టు ప్రాంతాలన్నీ పోలవరంతో ముంపులోనే ఉండిపోతాయి. ఈ క్రమంలోనే భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలనైనా ఇస్తే.. కరకట్టలను నిర్మించి నీటి ముప్పునుంచి భద్రాద్రిని తప్పించడానికి, పేద ప్రజలకు పునరావాసం కల్పించడానికి వీలవుతుందని మంత్రి పువ్వాడ అన్నారు.
ఇదీ సమస్య
భద్రాచలం దగ్గర గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు.. అక్కడినుంచి దిగువకు వెళ్లే కొద్దీ ఈ వెడల్పు తగ్గిపోతుంది. పాపికొండలు చేరేసరికి 750 నుంచి 800 మీటర్లకు పరిమితమవుతుంది. అక్కడినుంచి సముద్రం చేరేసరికి మళ్లీ వెడల్పు పెరుగుతుంది. భద్రాచలం దిగువన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 196 టీఎంసీలు. డెడ్ స్టోరేజి 125 టీఎంసీలు.. దీన్ని ముందుగా 141 అడుగుల ఎత్తుకు డిజైన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పుడే.. జలయజ్ఞంలో భాగంగా పోలవరం ఎత్తును 145.72 అడుగులకు పెంచేశారు. దీంతో డిశ్చార్జి కెపాసిటీ కూడా 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెరిగిపోయింది. ఈ కారణంగా ఉమ్మడి ఏపీలోని 7 మండలాలతోపాటు మొత్తం 384 గ్రామాలు మునిగిపోతాయి. అప్పటినుంచి తెలంగాణ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్తూనే ఉన్నది. రాష్ట్ర విభజన తరువాతనైనా తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు.
ముంపు ప్రాంతాల విషయంలో 36 లక్షల డిశ్చార్జి సామర్థ్యాన్నే లెక్కల్లో చూపుతున్నది. ఇదే విషయమై ఒడిశా, ఛత్తీస్గఢ్ సుప్రీ్ంటను ఆశ్రయించగా, ముంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పీపీఏకు, సీడబ్ల్యూసీకి ఆదేశాలను జారీచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆ కేసులో తెలంగాణ సైతం ఇంప్లీడ్ అయ్యింది. తెలంగాణలోనూ ముంపుపై డీమార్క్ చేయాలని పట్టుబడుతున్నది. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ దానిని పక్కనపెడుతూ వస్తున్నది. ఇటీవల నిర్వహించిన గవర్నింగ్ బాడీ మొదటి సమావేశంలో తెలంగాణ అభ్యంతరాలపై చర్చించలేదు. అటు.. పోలవరం ఎగువన కాఫర్ డ్యాం ఎత్తును ఒక మీటర్ పెంచాలని ఏపీ నిర్ణయించింది. ప్రస్తుతం కాఫర్ డ్యాంను 2.5 కిలోమీటర్ల పొడవు, 43 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. మున్ముందు పోలవరానికి 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొనేలా కాఫర్ డ్యాం ఎత్తు పెంచాలని నిర్ణయించారు.
నిత్యం ప్రమాదపుటంచునే..
141 అడుగుల ఎత్తు వరకు ఉంటేనే పోలవరం బ్యాక్ వాటర్ దుమ్ముగూడెం దాకా ఉంటుంది. ఎగువ నుంచి భారీ వరద వచ్చిందంటే.. బూర్గంపాడు మండలం సైతం మునిగిపోతుంది. ఇక ఇప్పుడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో బ్యాక్వాటర్ ఏకంగా భద్రాచలం దాకా చేరుకుంటుంది. వానలు, వరదలు వస్తే గోదావరి భద్రాచలంతోపాటు దాని చుట్టుపక్కల మండలాలను పూర్తిగా ముంచెత్తుతుంది. ఎఫ్ఆర్ఎల్ ను నిరంతరం నిర్వహిస్తే భద్రాచలం దగ్గర 45.72 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతుంది. అంటే భద్రాద్రి వాసులు 365 రోజులూ.. మొదటి ప్రమాద హెచ్చరిక పరిధిలో భయపడుతూ ఉండాలన్నమాట. ఇక డెడ్ స్టోరేజీ లెవల్లో పాపికొండల దగ్గర 30 అడుగుల ఎత్తువరకు నీటిమట్టం ఉండే అవకాశం ఉన్నది. డెడ్స్టోరేజీలో 125 టీఎంసీలు కచ్చితంగా పోలవరంలో నిలువ ఉంటాయి. దీనివల్ల నీరు దిగువకు ప్రవహించక.. భద్రాచలం దాదాపు ఎనిమిది నెలలపాటు నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
మొత్తం 92 గ్రామాలకు ముంపు ముప్పు..
పోలవరం వల్ల ఏర్పడే కొత్త ముంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పీపీఏకు లేఖను రాసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతోపాటు తెలంగాణకు ముంపు ముప్పు పొంచి ఉన్నదని, ఆ రాష్ర్టాలతో సమానంగా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇప్పటికే సీడబ్ల్యూసీ సైతం తెలంగాణలో ముంపుపై అధ్యయనం చేసిందని గుర్తుచేసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల కిన్నెరసాని, ముర్రేడువాగుల్లో నీరు నిలిచి ఉంటుందని, గోదావరిలో కలిసే ప్రసక్తే ఉండబోదని సీడబ్ల్యూసీ తేల్చిందని పేర్కొన్నది. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద ఉన్నప్పుడు కిన్నెరసానిలో ఎగువన 13.75 కిలోమీటర్లకు, ముర్రేడువాగులో గోదావరి నుంచి 5.25 కిలోమీటర్ల ఎగువ వరకు బ్యాక్వాటర్ నిలిచి ఉంటుందని వివరించింది. 50 శాతం డిపెండబులిటీ 25.53 లక్షల క్యుసెక్కుల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొన్నా గోదావరి నుంచి కిన్నెరసానిలో 13 కిలోమీటర్లు, ముర్రేడువాగులో 3.75 కిలోమీటర్ల బ్యాక్వాటర్ నిలిచి ఉంటుందని సీడబ్ల్యూసీ రిపోర్టు తేల్చిచెప్పిందని గుర్తుచేసింది. మారిన పోలవరం డిజైన్ వల్ల అదనంగా బూర్గంపాడు, భద్రాచలం మండలాలతోపాటు మొత్తం 92 గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపింది. కిన్నెరసాని, ముర్రేడువాగులో నీరు నిలిచి ఉండే ప్రాంతంవరకు రక్షణ గోడలు నిర్మించి, వరద నివారణ చర్యలు చేపట్టాలని పీపీఏకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఒత్తిడితో పీపీఏ ఇటీవలే స్పందించింది. తెలంగాణ ముంపుపై డిమార్కేషన్ చేయాలని పోలవరం ప్రాజెక్టు సీఈని ఆదేశించింది.