భద్రాద్రి కొత్తగూడెం : అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావును మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అధికారి మృతిపట్ల అటవీశాఖ సిబ్బంది సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. దీంతో రేంజర్ శ్రీనివాసరావు మండల అధికారి సంజీవరావుతో కలసి అడవుల్లో చెట్లు నరుకుతున్న గుత్తి కోయల వద్దకు వెళ్లారు. చెట్లను నరకవద్దని గుత్తి కోయలకు అధికారులు ఇద్దరూ సూచించారు. తమను అడ్డుకోవద్దని అధికారులను బెదిరించారు.
అంతటితో ఆగకుండా రేంజర్ శ్రీనివాసరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో రేంజర్ శ్రీనివాసరావు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న శ్రీనివాసరావును అటవీ సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అధికారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.