భద్రాచలం, మార్చి 2: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న మహా పట్టాభిషేకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలనుకొనే భక్తుల సౌకర్యార్థం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువ గల సెక్టార్ టికెట్లను, పట్టాభిషేకం కోసం వెయ్యి విలువ గల సెక్టార్ టికెట్లను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. ఆసక్తి గల భక్తులు స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం టికెట్లను www. bhadrachalamonline.com ద్వారా పొందవచ్చని సూచించారు. వివరాల కోసం 08743-232428 నంబరులో సంప్రదించాలని ఈవో కోరారు.