హైదరాబాద్: దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 17న శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. నవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. ఏప్రిల్ 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు.
వీటిని కొనాలనుకునేవారు bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించారు. దీనికోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ వెబ్సైట్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. కాగా, సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్నవారు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో తమ ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాలని చెప్పారు.