Bhadrachalam | ఒమిక్రాన్ దృష్ట్యా భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే శ్రీ స్వామి వారి తెప్పోత్సవానికి భక్తులకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. అలాగే 13న నిర్వహించే ఉత్తరద్వార దర్శనానికి కూడా భక్తులకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా కొద్దిమంది అర్చకులు, వేదపండితులతో పాటు సిబ్బంది సమక్షంలోనే వాటిని నిర్వహిస్తామన్నారు. అయితే ఈ ఉత్సవాల కోసం ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసుకొన్న భక్తులకు సదరు వెబ్సైట్ ద్వారానే తిరిగి నగదు చెల్లింపు చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని భక్తులు పరిగణనలోకి తీసుకోని, ముక్కోటి ఉత్సవాలు, తెప్పోత్సవం మరియు ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం భక్తులు భద్రాచలం రావొద్దని ఆయన కలెక్టర్ కోరారు.
ఓమిక్రాన్ వేరియంట్, కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ వరకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నామని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. సామూహిక మత కార్యక్రమాలు, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు అనుమతి లేదని చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించామని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.