ఆస్పిరేషనల్ జిల్లాగా కేంద్రం ప్రకటన
పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో టాప్
జిల్లా యంత్రాంగానికి జల్శక్తి ప్రశంస
పల్లెప్రగతితో అగ్రగామిగా తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : పల్లెప్రగతి మరోసారి తెలంగాణ పల్లెలను దేశంలోనే అగ్రభాగాన నిలిపింది. పచ్చదనం, పరిశుభ్రత ద్వారా కాలుష్యం, ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడుకోవడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషనల్ జిల్లాగా నిలిచినట్టు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ విజయంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ వివరాలను పీఐబీ ద్వారా విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెంలోని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా మార్చడం, ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలు ఈ జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలిపినట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో 1,386 ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు
దేశవ్యాప్తంగా 102 జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాలుగా ఎంపిక చేశారు. ఇవన్నీ గిరిజన, ఎస్సీ జనాభా అధికం గా ఉన్న జిల్లాలు, కొండ ప్రాంత, వెనకబడి జిల్లాలే. వీటిలో రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇంటింటికీ ఉన్న నల్లా నీటి వసతులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించిన గ్రామాలను ఉత్తమైనవిగా గుర్తిస్తారు. మొత్తం 60 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వాటిని ఎంపిక చేస్తారు. ఎంపికైన 102 జిల్లాల్లోని 1,09,291 గ్రామాల్లో ఓడీఎఫ్ (బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత) ప్లస్ గుర్తింపు పొందినవి 4,190 గ్రామాలే. వీటిలో 1,386 గ్రామాలు తెలంగాణ నుంచి ఆస్పిరేషన్ జిల్లాలుగా ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 479 గ్రామాల్లో ఏకంగా 98.48 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపును పొందాయి. కానీ 35 ఆస్పిరేషన్ జిల్లాల పరిధిలో కనీసం ఒక్క గ్రామం కూడా ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపును పొందలేదు. ‘ఆస్పిరేషన్’ జాబితాలో ఉన్న 5 జిల్లాలో మాత్రమే 50 శాతం కంటే ఎక్కువ గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు పొందాయి.
వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2019లోనే ఓడీఎఫ్ గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ జిల్లాలో 89,506 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకొన్నారు. 32,791 వ్యక్తిగత, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగా ప్రదేశాల్లో మరో 1,331 ఇంకుడు గుంతలు నిర్మించారు. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ)లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు 4 ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లను ఏర్పా టు చేశారు. సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే వ్యర్థాల ప్రాసెసింగ్కు వీటిని ఉపయోగిస్తారు. తద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూటికి నూరు శాతం ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు లభిస్తుంది.
గ్రామాల్లో శిక్షణ
పల్లెప్రగతిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ(ఎస్ఎల్డబ్ల్యుఎం)పై దృష్టి పెట్టింది. 22 మండలాలు, 479 గ్రామాల్లో ప్రతి గ్రామానికీ ఒక ట్రాక్టర్ను కొనుగోలుచేసి, డంపింగ్ షెడ్లను నిర్మించారు. ఘన, ద్రవ వ్య ర్థాల నిర్వహణపై ‘వాష్’ సంస్థ సహకారంతో పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీంతో డంపింగ్ షెడ్లన్నీ వినియోగంలోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో చెత్తను సేకరించేటప్పుడే 168 గ్రామాల్లో 100 శాతం వ్యర్థాలను ఘన, ద్రవ వ్యర్థాలుగా వేరుచేసి సేకరిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో ఇది 70 శాతంగా ఉన్నది. దీన్ని 100 శాతానికి చేర్చేందుకు ఆయా గ్రామ పంచాయతీల స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ప్లాస్టిక్హ్రిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 2019 సెప్టెంబరులోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించారు. వీటి స్థానంలో వస్త్రంతో తయారైన వస్తువులను ఉపయోగించేలా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రచారం చేస్తున్నారు.