హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘మీకు రూ.9 లక్షల లాటరీ వచ్చింది. మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా ఆ డబ్బులు రెండ్రోజుల్లో జమవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఈ కూపన్లో మీ పేరు, బ్యాంక్ఖాతా వివరాలు, మీ ఆధార్ నంబర్, అడ్రస్, ఫోన్ నంబర్ నింపి, దాన్ని ఫొటో తీసి మేం ఇచ్చిన నంబర్కు వాట్సాప్ చేయడమే’అంటూ నల్లగొండ జిల్లాకు చెందిన బ్రహ్మచారికి పోస్ట్లో లెటర్ వచ్చింది. అయితే తాను లాటరీ టికెట్గానీ, ఏ వస్తువులుగానీ కొనుగోలు చేయకుండానే బహుమతులు ఎలా వస్తాయి?..అని ఆలోచించడంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ, చాలామంది ఇలాంటి లెటర్లు చూసి మోసపోతున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా ఉత్తరాలు పంపుతున్నారు. టీవీ యాడ్స్లో సుపరిచితమైన న్యాప్టోల్ కంపెనీ పేరిట వీటిని పంపుతున్నారు. ప్రతి ఉత్తరంలో ఒక కూపన్ పెడుతున్నారు. దానిని స్క్రాచ్ చేస్తే.. కోడ్ నంబర్తోపాటు ఎంత మొత్తానికి లాటరీ తగిలిందో రాసి ఉంటుంది. అదంతా నిజమే అనిపించేలా దాని మీద ఒకవైపు ఏదో ఒక బ్యాంక్ ముద్ర, మేనేజర్ పేరిట సంతకం.. మరోవైపు న్యాప్టోల్ కంపెనీ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ పేరిట ముద్ర, దానిపై సంతకం అంతా పక్కాగా ఉండేలా తయారుచేస్తున్నారు. ఇలాంటి ఉత్తరాలు చూసి, చాలామంది అమాయకులు వారి పూర్తి వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్కార్డు అన్నీ పంపుతున్నారు. అవి అందుకొన్న సైబర్ కేటుగాళ్లు అసలు పని మొదలుపెడుతున్నారు.
ఇలా మోసగిస్తారు.. జాగ్రత్త..!