హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం అత్యంత క్లిష్టంగా మారుతున్నది. అసలు విషయాన్ని తెలుసుకొనేలోపే ఫేక్ న్యూస్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. ఎత్తిపోతల వాట్సప్ గ్రూప్లతో రోజూ లక్షల కొలదీ చెత్త మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, ఎడిటింగ్ చేసిన వీడియోలతో తప్పుడు సమాచారాన్ని అందంగా వండివార్చే సోషల్ కేటుగాళ్లు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. వీరు పంపిన సమాచారాన్ని అందుకొన్నవారు ఆయా మెసేజ్లు లేదా ఫొటోలు/వీడియోల్లో ఎంత నిజం ఉన్నదో నిర్ధారించుకోకుండానే యాథాలాపంగా ఇతర గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో నిత్యం ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. మున్ముందు ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్కు చెక్ పెట్టేందుకు సైబర్ సెక్యురిటీ నిపుణులు ఓ సూత్రాన్ని కనిపెట్టారు. అదే పీఏఆర్ఐ (పాజ్, ఆస్క్, రీడ్/రివ్యూ, ఇన్ఫార్మ్). సంక్షిప్తంగా ‘పరి’ అని పిలిచే ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించడంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెప్తున్నారు.