హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) ఈ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. యూఎన్డబ్ల్యూటీవో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక పోటీలో ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ఎంట్రీలు వచ్చాయి. మన దేశం నుంచి మూడు గ్రామాలను సిఫారసు చేయగా భూదాన్పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. భూదాన్పోచంపల్లి ప్రపంచఖ్యాతి చెందడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతోషం వ్యక్తంచేశారు. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, టూరిజంశాఖ ఎండీ బీ మనోహర్రావుకు అందజేసి, శాలువాతో సత్కరించారు. పర్యాటకశాఖ అధికారులుచేసిన కృషిని ముఖ్యమంత్రి అభినందించారు.