హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ సహా వృత్తివిద్యాకోర్సుల్లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రవేశాల గడువు 202324 విద్యాసంవత్సరంతో ముగియనున్నది. దీంతో తాజా ప్రవేశాలే ఆఖరుకానున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వృత్తివిద్యాకోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్లకు ప్రభుత్వం 2014లో జీవో జారీ చేసి, 10 ఏండ్ల గడువు విధించింది. ఇందులోభాగంగా 85 శాతం స్థానికులకు, 15 శాతం ఓపెన్ కోటా కింద సీట్లను భర్తీ చేస్తున్నారు. గురువారం ఎంసెట్ ఫలితాలు విడుదల చేయగా, పలువురు ఏపీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో తొలి పది ర్యాంకుల్లో ఏపీకి చెందినవారే కావడం విశేషం.
ఇంజినీరింగ్ టాప్10 ర్యాంకుల్లో ఎనిమిది మంది, అగ్రికల్చర్, మెడికల్ టాప్10 ర్యాంకుల్లో ఏడుగురు ఏపీ విద్యార్థులే ఉన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తుండటం.. తెలంగాణ ఐటీ రంగం రోజురోజుకు పురోభివృద్ధి సాధిస్తుండటంతో ఏపీ విద్యార్థులు ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. దీనికితోడు ప్లేస్మెంట్స్ కల్పించే సంస్థలు అత్యధికంగా రాష్ట్రంలోనే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కాలేజీల విద్యార్థులనే కంపెనీలు ఎంపిక చేసుకొనే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యం లో ఏపీ విద్యార్థులు తెలంగాణలో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతోనే టీఎస్ ఎంసెట్కు డిమాం డ్ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జేఈఈ వారేరి
ఎంసెట్ టాప్10 ర్యాంకర్లలో విద్యార్థులెవరు మొత్తం 160 మార్కులను సాధించలేకపోయారు. ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకర్లలో జేఈఈ ర్యాం కర్లు పెద్దగా లేకపోవడం గమనార్హం. సహజంగా జేఈఈ ర్యాంకర్లే ఎంసెట్ టాపర్లుగా నిలుస్తారు. ఫలితాలను బట్టి చూస్తే జేఈఈ ర్యాంకర్లలో అత్యధికులు మమ అనిపించినట్టు పరీక్ష రాశారని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సి టీకి చెందిన ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.