మహబూబ్ నగర్ : గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ. 2 కోట్ల 75 లక్షల వ్యయంతో నిర్మించిన గిరిజన బాలికల, ఉద్యోగినిల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు గురుకులాలు ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
గిరిజన సంక్షేమ వసతి గృహం ఏర్పాటు వల్ల నిరుపేద గిరిజన విద్యార్థులకు ఉచితంగా వసతి సౌకర్యం లభించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు యాదమ్మ, రాంలక్ష్మణ్, వనజ, మోతిలాల్, జిల్లా ఆదనపు కలెక్టర్ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.