హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్) నిధులు విడుదల చేస్తున్నట్టుగా అక్టోబర్లోనే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా యాజమాన్యాల ఖాతాలో జమకాలేదు. దీనిపై స్కీమ్కు సంబంధించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం నిధులు చెల్లించడం లేదని, పాఠశాలలు నిర్వహించలేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీలు కలిపి 26వేల మంది విద్యార్థులు ఉచితంగా విద్య పొందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూ.220కోట్ల నిధులు బకాయి పెట్టింది. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఈ స్కీమ్ కింద చేర్చుకోబోమని చెప్పాయి. ఒకానొక దశలో దళిత, గిరిజన విద్యార్థులను పాఠశాలలకు అనుమతించలేదు. సర్కార్పై తీవ్ర విమర్శలు ఎదురవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బకాయి నిధుల్లో 183కోట్లు విడుదల చేస్తున్నట్టుగా అక్టోబర్లో ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికీ 6నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో జమకాని దుస్థితి నెలకొన్నది.