Dalith Bandhu | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించేంత వరకూ దళితబంధు పథకం ముందుకు సాగదని తెలుస్తున్నది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సగం మొత్తం నిధులు విడుదల చేసిన లబ్ధిదారుల అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసినట్టు వివరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అవి అలాగే కొనసాగనున్నాయని సమాచారం. దళితబంధు మొదటి విడతలో మొత్తంగా 38,323 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందజేసింది. వారంతా యూనిట్లను ఏర్పాటు చేసుకోవడంతో విజయవంతంగా ఆర్థిక పురోగతి సాగిస్తున్నారు.
దళితబంధు రెండో విడతలో భాగంగా 2023-24 సంవత్సరానికిగాను హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1100 కుటుంబాల చొప్పున, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలకు కలిపి మొత్తంగా 1,30,000 కుటుంబాలకు ఆ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల పరిధిలో నిర్ణీత సంఖ్యలో దళితబంధు ఎంపికకు సంబంధించిన జాబితాలు కూడా తుదిదశకు చేరుకొన్నాయి. ఆయా జాబితాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రారంభించారు. అర్హులను గుర్తించి లబ్ధిదారుల ఎంపికను సైతం చేపట్టారు. రెండోవిడతలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో దాదాపు 162 సఫాయి కర్మచారి సిబ్బందిని గుర్తించి, వారికి రూ.16.20 కోట్లతో సిల్ట్ కార్టింగ్ వెహికిల్స్ను అందించి దళితబంధు రెండోవిడతను గత ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిగతా లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీకి బ్రేక్ పడింది.
దళితబంధుపై కాంగ్రెస్ సర్కారు సమీక్ష
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ పథకంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలువురు దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టు చెప్తున్నారు. దళితబంధు పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేసిన విషయం తెలిసిందే. అందులో కొంత సొమ్ముతో లబ్ధిదారులు చిన్న చిన్న యూనిట్లను పెట్టుకోగా, మిగతా నిధులను అకౌంట్లలోనే భద్రపరుచుకొన్నారు. ఆ నిధులకు బ్యాంకులు వడ్డీని కూడా జమచేస్తున్నాయి. ప్రస్తుతం పథకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. లబ్ధిదారులు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా నిలుపుదల చేశారు. ఈ మేరకు జిల్లాల అధికారులు సైతం బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఎవరూ బాధ్యతలను స్వీకరించలేదు. మరోవైపు సాంఘిక సంక్షేమ సెక్రటరీగా ఉన్న రాహుల్బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పూర్తిస్థాయి కార్యదర్శిని ప్రభుత్వం ఇప్పటివరకు నియమించలేదు. దీంతో శాఖాపరమైన కార్యక్రమాలన్నీ స్తంభించిపోయాయి. మంత్రితోపాటు కార్యదర్శి వచ్చి, సమీక్ష నిర్వహించిన తర్వాతే దళితబంధుపై స్పష్టత వచ్చే అవకాశమున్నది. ఈ నేపథ్యంలోనే అధికారులు సైతం అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టు సమాచారం.
దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం?
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అని లబ్ధిదారులతోపాటు దళితవర్గాల్లోనూ జోరుగా చర్చ కొనసాగుతున్నది. అయితే దళితబంధు తరహాలోనే అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ సర్కారు సైతం ఇప్పటికే ప్రకటించింది. చేవేళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ఈ మేరకు హామీ ఇచ్చింది. వచ్చే ఐదేండ్లలో అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సరిపడా నిధులు కేటాయిస్తామని కూడా మ్యానిఫెస్టోలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పథకం అమలు చేయాలన్నా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి తప్పనిసరి. మంత్రి వస్తే తప్ప ఆయా అంశాల్లో స్పష్టత రాదనేది సుస్పష్టంగా తెలుస్తున్నది.