Dalith Bandhu | నల్లగొండ రూరల్, డిసెంబర్ 18: నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు పథకం యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితబంధు ప్రొసీడింగ్ కాపీలు పొందిన లబ్ధిదారులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దళితబంధు పథకం రెండో విడుతలో నల్లగొండ నియోజకవర్గంలో 1,055 మందిని ఎంపిక చేశారని, వారు బ్యాంకు అకౌంట్లు సైతం ఓపెన్ చేశారని తెలిపారు.
గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో, మున్సిపల్ వార్డుల్లో సభల ద్వారా అర్హులను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఎంపిక చేసిన లబ్ధ్దిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సమాచారం ఇచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న జిల్లా కేంద్రంలో ప్రొసీడింగ్ కాపీలు అందజేశారని వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసినందున ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, తమకు మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన కమిటీ నాయకులు పాలడుగు నాగార్జున, బకరం శ్రీనివాస్, అద్దంకి రవి తదితరులు పాల్గొన్నారు.