బెల్లంపల్లి, మే 25 : ‘బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు. ఆషాఢం, ఇతర దుర్ముహూర్తాల తర్వాత మంచి రోజు చూసుకొని సీనియర్ పురోహితుల సూచన మేరకు కార్యాలయాన్ని ప్రారంభిస్తా. అప్పటివరకు వారంలో రెండు రోజులే బెల్లంపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటా’ అని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇప్పుడిప్పుడే బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యలు అర్థం చేసుకుంటున్నానని, పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతానని స్పష్టం చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకే ఆ నియోజకవర్గ సమస్యలపై అవగాహన పెంచుకోవడానికి మూడేండ్లు పట్టిందని, తనకు కనీసం ఆరునెలలైనా పడుతుందని చెప్పుకొచ్చారు.
బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖానను మూసివేయకుండా పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా జీఎం, సీఎండీతో మాట్లాడుతానని చెప్పారు. నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలపై కలెక్టర్తో చర్చించినట్టు తెలిపారు. సీఎంతో మాట్లాడి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. బెల్లంపల్లి పట్టణంలోని అక్రమ కట్టడాలపై టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.