హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తన జన్మదిన వేడుకలకు హాజరుకాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. దీంతో సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ శుక్రవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 24న బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని నలుగురు సిబ్బంది నుంచి మున్సిపల్ కమిషనర్ వివరణ కోరారు. ఆ వివరణ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారి మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో వెంటనే ఆ కమిషనర్ను సస్పెండ్ చేయాలని సీడీఎంఏకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయాల్లో గానీ, వ్యక్తిగతంగా గానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రొత్సహించే వ్యక్తుల్లో తాను చివరిగా ఉంటానని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.