హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14(నమ స్తే తెలంగాణ): హైదరాబాద్లో బిల్డర్లు కేవలం ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలకే పరిమితమవకుం డా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయం లో అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించిన బిల్డర్లు.. తాజాగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్)తో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని 51 చెరువుల సుందరీకరణ పనులను చేపట్టేందుకు ముందుకొచ్చారు. అందుకోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం మేరకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా చెరువులను తీర్చిదిద్దేందుకు ఒక్కో నిర్మాణ సంస్థ రూ.కోటి నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. చెరువుల చుట్టూ పచ్చదనాన్ని మెరుగుపర్చడంతోపాటు థీమ్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, గజీబోలు, యాంఫీ థియేటర్, టాయిలెట్స్, చిన్నారుల కోసం ఆట స్థలాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే దుర్గం చెరువు, మల్కం చెరువును అద్భుత పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్ది, సినిమా షుటింగ్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిపారు.