హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘మీరు ఆరోగ్యశ్రీ కార్డును మూడేండ్లుగా వాడలేదా? అయితే ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథ కం కింద రూ.22 వేలు వస్తాయి. అది కూడా ఫోన్పేలో. డబ్బుకావాలంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి’ అంటూ సైబర్ మాయగాళ్లు కొత్త ఎత్తుగడకు ప్లాన్ వేశారు. ఆ లింక్ క్లిక్ చేశామో! మన బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావటం ఖాయం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ యువకుడి ఫోన్కు ఇలాంటి మెసేజ్ వచ్చింది. ఆ యువకుడు అందులో ఉన్న ఫోన్ నంబరును సంప్రదించాడు. తాను పంపిన లింక్ క్లిక్ చేయాలని అవతలి వ్యక్తి చెప్పటంతో లింక్ క్లిక్ చేశాడు. నేరుగా ఫోన్ పే యాప్ ఓపెన్ అయ్యి, అక్కడ బాక్సులో రూ.22 వేలు కనిపించాయి. పిన్ నంబర్ ఎంటర్ చేసి, పే మీద క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పటంతో అలాగే చేశాడు. వెంటనే అతడి ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయి. తిరిగి ఫోన్ చేసి అడిగితే.. అరే అలాగా! అంటూ మరోసారి లింక్ క్లిక్ చేసి, పిన్ ఎంటర్ చేయమన్నారు. దీంతో మరోసారి డబ్బులు పోగొట్టుకొన్నాడు. అలా మూడు సార్లు చేయటంతో ఆ యువకుడు రూ.66 వేలు పోగొట్టుకున్నాడు. ఈ మోసంపై బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది గుర్తుంచుకోండి
ఫోన్పేలో మనం చెల్లించేందుకు మాత్రమే ఆప్షన్ ఉంటుంది. రిసీవ్డ్ ఆప్షన్ ఉండదు. ఎవరైనా మన ఖాతాలో వేస్తే అవి నేరుగా మన ఖాతాలో పడతాయి. ఎవరైనా ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ వాడకుంటే మీ ఖాతాలో డబ్బులు పడుతాయని చెప్తే అది సైబర్ మోసమని గుర్తించాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సందేశాలు వచ్చినపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.