హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు.
ఆ ఆరు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపారు. 2015లో వడదెబ్బ, సన్ స్ట్రోక్ డెత్స్ ఎక్కువగా సంభవించాయి. ప్రజలను ఎండలను దృష్టిలో ఉంచుకొని తమ టైమ్ టేబుల్ను సిద్ధం చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దు. ఈ మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలని సూచించారు.
చెమట రాకపోవడం, నాలుక ఎండిపోవడం, పెదాలు పగిలిపోవడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, వికారంగా ఉండటం, గుండెదడ, మూత్రం రాకపోవడం లాంటి లక్షణాలు వడదెబ్బ లక్షణాలు అని శ్రీనివాస్ రావు తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే దగ్గర్లోని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లాలి. పానీయాలు అందించాలి. గాలి బాగా తగిలేటట్లు చూడాలి. కుదుట పడకపోతే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందించాలి. అప్పుడు వడదెబ్బ నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులు, వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కలుషితం లేని నీటిని మాత్రమే తీసుకోవాలని శ్రీనివాస్ రావు చెప్పారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలాలు తీసుకోవద్దు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు గర్భిణి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణి స్త్రీలు ఆస్పత్రులకు వెళ్లాలనుకుంటే మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్లోనే వెళ్లాలని శ్రీనివాస్ రావు సూచించారు.