తిమ్మాపూర్, డిసెంబర్ 31: ఆరుతడికి ప్రాధాన్యమివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులను కోరారు. ఆదివారం ఆయన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్తో కలిసి లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఎల్ఎండీ నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీటిని అందిస్తామని తెలిపారు. ఎల్ఎండీలో ప్రస్తుతం 19 టీఎంసీలకుపైగా, మిడ్ మానేరులో 23 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. వీటిలో తాగు నీటి అవసరాలకు పోను సాగు నీటి అవసరాలకు 29 టీఎంసీలను అందజేస్తామని తెలిపారు. కాకతీయ కాలువ 146-284 కిలో మీటర్ల వరకు మొదటి విడతలో 5 లక్షల ఎకరాలు, 284-346 కిలోమీటర్ల వరకు 3.98 లక్షల ఎకరాలు మొత్తంగా 9 లక్షల ఎకరాలకు నీటినందిస్తామని చెప్పారు. పొలాలకు నిరాటంకంగా నీరందాలంటే ఆరుతడి పంటలను సాగుచేయాలని కోరారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి వాణిజ్య పంటలు వేసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం కటువుగా వ్యవహరిస్తుందని అన్నారు.