కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 7: కరీంనగర్లో చేపడుతున్న స్మార్ట్సిటీ అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మానేరు రివర్ ఫ్రంట్ పనులను కూడా పూర్తి చేస్తామని, ఈ నెలాఖరులోగా కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బుధవారం కాపువాడ బైపాస్ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు.
ఓ వైపు స్మార్ట్సిటీ, మున్సిపల్ నిధులు, మరోవైపు సీఎం హామీ నిధులు, పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణ పనుల్లో నిబంధనలు, నాణ్యతలో రాజీపడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగరవాసులు ప్రశాంత వాతావరణంలో నివసించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, కోల మాలతి తదితరులు పాల్గొన్నారు.