ఉద్యోగాల భర్తీ కోసం ప్రధానికి కృష్ణయ్య లేఖ
వచ్చేనెలలో పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన
ముషీరాబాద్, ఫిబ్రవరి 10: దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రభుత్వం చెప్పినట్టుగా 72 కేంద్ర మంత్రిత్వశాఖల్లో 8.72 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 6 లక్షల ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ తదితర రంగాల్లో ఖాళీగా ఉన్న 15 లక్షల ఖాళీలను వెంటనే నింపాలని కోరుతూ మార్చిలో పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు కృష్ణయ్య వెల్లడించారు. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న కేంద్ర సర్కారు.. ఉద్యోగ ఖాళీలను మాత్రం భర్తీచేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్రం సేకరించిన సమాచారం ప్రకారం.. కేంద్రంలో బీసీ ఉద్యోగులు 9 శాతమే ఉన్నట్టు తేలిందని, 56 శాతం ఉన్న బీసీలకు 9 శాతం ఉద్యోగ ప్రాతినిధ్యం దురదృష్టకరమని పేర్కొన్నారు. 15 లక్షల ఉద్యోగాలు నింపితే బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని తెలిపారు.