ఖైరతాబాద్, ఆగస్టు 25 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి సర్కార్ ఫీజు బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని, పథకాన్ని యథావిధిగా కొనసాగించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మోదీ రాందేవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లకు నిధులు లేవనడం దారుణమని పేర్కొన్నారు. కలెక్టరేట్ ముట్టడి పోలీసులు, విద్యార్థుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. కార్యక్రమంలో నిఖిల్ పటేల్, నీలం వెంకటేశ్, అనంతయ్య, రాజేందర్, నరేష్గౌడ్, అంజిగౌడ్, శివయాదవ్, చిల్లర యశ్వంత్, బాలయ్య నరేశ్చారి, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.