హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్రం కుల గణన చేయకుండా జనాభాలో 56% ఉన్న బీసీల మనోభావాలను దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు.
బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా, ఉద్యమాలు చేసినా పెడచెవిన పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 50% బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేట్ సెక్టార్లలో ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని, వివిధ నామినేటెడ్ పదవులలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఓబీసీలకు రూ.500 కోట్ల నిధులు విడుదల చేసి, స్వయం ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎం కుమార్, పూసల సత్యనారాయణ, జగదీశ్ గౌడ్, దిలీప్ ముదిరాజ్, సాయిబాబా, రాహుల్, శివ పాల్గొన్నారు.