హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/ గోల్నాక/ చంపాపేట: బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేయడంపై శనివారం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమమయ్యాయి. సీఎం నిర్ణయాన్ని అన్ని సంఘాలు స్వాగతిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని చాటారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. జనగణనతోపాటే బీసీ కులగణన చేయాలని సీఎం కేసీఆరే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం బీసీల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భమని అభివర్ణించారు. బీసీ కులగణన చేయాలని కేంద్రానికి తీర్మానం చేసిన తొలి అసెంబ్లీ తెలంగాణ అని, ఆ ఘనత సీఎం కేసీఆర్ రూపంలో రాష్ట్ర బీసీలకు దక్కిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీల విజ్ఞప్తిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బీసీ, ఎంబీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలుచేస్తూ దేశానికే మార్గనిర్దేశం చేస్తున్నారని రాష్ట్ర ఎంబీసీ కో-కన్వీనర్ కొండూరి సత్యనారాయణ పేర్కొన్నారు. కేంద్రం జనగణనతోపాటు కులగణన చేయాలని అసెంబ్లీతో ఏకగ్రీవం తీర్మానం చేయించి సీఎం కేసీఆర్ బీసీ పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ బీసీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీకృష్ణ , జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంగౌడ్ పేర్కొన్నారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ కులగణనకు తీర్మానం చేసిన సీఎం కేసీఆర్కు రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడు నడికూడ జయంత్రావు, ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ ధన్యవాదాలు తెలిపారు. చంపాపేటలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని చెప్పారు.